శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సస్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ ఆదివారం మొదలైంది. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల క్యాంపస్లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రం వేదికగా స్పాట్ ఆరంభమైంది. రెండు విడతల్లో జరుగుతున్న ఈ మూల్యాంకనంలో మొదటి స్పెల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, హిస్టరీ, బోటనీ, జువాలనీ, ఫిజిక్స్ తదితర పేపర్ల జవాబుపత్రాలను దిద్దుతున్నారు ఉదయం ఆయా సబ్జెక్టుల్లో సీఈలు, ఏఈలతో కూడిన బోర్డులను ఏర్పాటుచేశారు. అనంతరం సీఈలు, ఏఈలకు ఇంటర్బోర్డు జిల్లా అధికారులు పలు సూచనలు చేశారు.
ఏమరపాటు వద్దు..
ఆర్ఐఓ/క్యాంప్ ఆఫీసర్ ఎం.కృష్ణవేణి నేతృత్వంలో జనరల్–1 జి.వెంకటేశ్వరరావు, జనరల్–2 సత్యన్నారాయణ, సీనియర్ ప్రిన్సిపాల్ బి.శ్యామ్సుందర్ తదితరులు మాట్లాడుతూ దిద్దుబాటు ప్రక్రియలో ఏమరుపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు సైతం పరీక్షలు రాసిన విషయాన్ని గుర్తుంచుకుని దిద్దుబాటు చేపట్టాలన్నారు. సమయపాలన పాటించాలని, మండే ఎండల నేపథ్యంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కాగా, జిల్లాకు 55వేల జవాబుపత్రాలు చేరుకున్న విషయం తెలిసిందే.


