జయపురం: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ అన్నారు. బొయిపరిగుడ పోలీస్స్టేషన్ పరిధి మావో ప్రభావిత కాటపొడ గ్రామ పంచాయతీ పెటగుడ గ్రామంలో జనసంపర్క కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం, ప్రజలు – పోలీసులకు మధ్య సంబంధాలు ఏర్పడేందుకు జనసంపర్క శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వడం ద్వారా మావో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువలన ప్రజలు నిర్భయంగా ఉంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మావోల ప్రభావం తగ్గడానికి కారణం పోలీసులు ప్రజలకు అండగా ఉండడమేనన్నారు. ప్రజలు ఎప్పుడు పోలీసుల సహాయం కోరినా వెంటనే వారికి సహకరించేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. పోలీసులకు కూడా ప్రజలు సహకరిస్తే దొంగతనాలు, దోపిడీలు, నేరాలు నియంత్రించవచ్చన్నారు. అనంతరం పోలీసులు గ్రామ ప్రజలకు చీరలు, లుంగీలు, గావంచాలు, దుస్తులు, బెడ్షీట్లు, గొడుగులు తదితర సామగ్రి పంపిణీ చేశారు.


