జయపురం: జయపురం సమితి ఫూల్బెడ గ్రామంలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, జయపురం ట్రైబుల్ ఆగ్రో బయో డైవర్సిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఒడిశా బయో డైవర్సిటీ బోర్డు కలిసి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభా గృహంలో కమ్యూనిటీ సీడ్ ఫెస్టివల్ (విత్తన మహోత్సవం) శనివారం నిర్వహించారు. రీసెర్చ్ కేంద్రం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ మాట్లాడుతూ.. విత్తన ప్రాధాన్యతను వివరించారు. రీసెర్చ్ సెంటర్ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. పారంపరిక విత్తనాల సంరక్షణ, జలవాయు పరివర్తన వలన వాతావరణ మార్పును ఎదుర్కొవడం, కమ్యూనిటీ విత్తనాల ప్రణాళికలపై ప్రసంగించారు. భవిష్యత్ తరాల కోసం దేశీ విత్తనాలు సంరక్షించాలని శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ లెంక పిలుపునిచ్చారు. మండియ రాణి డాక్టర్ రొమిమతి ఘివురియ మాట్లాడుతూ పౌష్టికాహారం కోసం కోసం దేశీ విత్తనాల పరిరక్షణ అవసరాన్ని వివరించారు. అనంతరం విత్తన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా వ్యవసాయ విభాగ అధికారి సంజీవ కుమార్ మహంతి, విత్తన ప్రమాణిక అధికారి ప్రదీప్ కుమార్ ఖొర, ఉద్యాన వ్యవసాయ అదనపు అధికారి సంజీవ్ కుమార్ మహంతి, మృత్తికా సంరక్షణ అధికారి సొనాలీ నాయక్, ప్రభుత్వ అటవీ విభాగ అధికారి డాక్టర్ అమిత్ కుమార్ నాయిక్, సూర్జిత్ తురుక్ తదితరులు పాల్గొన్నారు.


