పర్లాకిమిడి: రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో గజపతి జిల్లాలో ఖరీఫ్ సీజన్కు రైతులు సమాయత్తమవుతున్నారు. దీంతో గజపతి జిల్లా వ్యవసాయ కేంద్రంలో 25 కిలోల వరి విత్తనాలు సబ్సిడీ ధరలకు అమ్ముతున్నారు. కానీ ఈ ప్రాంతంలోని జాజిపూర్, కాశీనగర్, కెరండీ, అమర గ్రామ రైతులు ఆంధ్రప్రదేశ్ వరి విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్ర నుంచి దిగుమతి అవుతున్న వరి విత్తనాల బ్యాగులు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా.. వరి విత్తనాలు పొలాల్లో జల్లితే నారు బాగుంటుందని, వరిపంట దిగుబడి బాగుంటుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఒడిశా సీడ్ కార్పొరేషన్ 26 కిలోల బస్తా విత్తనాలు 1061ని రూ.750లకు అమ్ముతుండగా, ఆంధ్రప్రదేశ్ వరి విత్తనాల రకాలు రూ.1500లకు అమ్ముతున్నారు. అయినా ఒడిశా రైతులు సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు కొనడానికి ముందుకు రావడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీంతో భువనేశ్వర్ వ్యవసాయ సీడ్ కార్పొరేషన్ నుంచి ఇక్కడి అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు.
గజపతి జిల్లాలో వర్షాలు
పర్లాకిమిడి: కాల వైశాఖి ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో గజపతి జిల్లాలో పలు సమితిల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాయగడ బ్లాక్ కోయిపూర్, జిరంగో, గారబంద గ్రామాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఈ వర్షాలతో రైతులు దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం పరిధిలో జాతీయ రహదారికి కొద్ది దూరంలో వంశధార ఎడమ కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, కాఫీ కలర్ రౌండ్ నెక్ టీ షర్టు ధరించి ఉన్నాడని, టీ షర్టు వెనుక వీఎల్ గోల్డు కలర్ అక్షరాలు ఉన్నాయని, లైట్ కాఫీ కలర్ కాటన్ జీన్ ఫ్యాంట్ ధరించి టక్ చేసుకొని ఉన్నాడని వివరించారు. నీలం రంగు బ్యాటరీ వాచ్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు కోటబొ మ్మాళి పోలీసులు(6309990861)కు సమాచారం అందించాలని కోరారు.
పెంటిభద్రలో..
పలాస: పెంటిభద్రలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎండవేడికి డీహైడ్రేషన్కు గురై మూడు రోజులు క్రితమే చనిపోయ ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


