రాయగడ: ఎస్ఐఆర్ను గిరిజన ప్రాంతాల్లో సమర్దవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుణుపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ నేతృత్వంలో గుణుపూర్ సమితిలోని లంజియా సవర గిరిజనులు అధికంగా నివసించే రైజింగ్తల్ గ్రామాన్ని అధికారులు శనివారం సందర్శించారు. గ్రామస్తులకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి అజిత్ సబర్ స్థానిక లంజియా సౌర గిరిజనులకు వారి మాతృభాషలో వివరించారు. సర్ కార్యక్రమం ఉద్దేశం, ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు ఇతర అప్డేట్ల ప్రక్రియలను గ్రామస్తులకు సులభంగా అర్థమయ్యేలా తెలిపారు. కార్యక్రమంలో గుణుపూర్ తహసీల్దార్, సమితి అధికారి తదితరులు పాల్గొన్నారు.


