రాయగడ: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం అమ్ ఆద్మీ పార్టీ ( ఆప్ ) సన్నద్ధమవుతుంది. ఈ మేరకు జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు నాయకులు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు జన్మాజయ్ స్వయ్ స్థానిక రాణిగుడఫారంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆప్ జాతీయ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిశికాంత్ మహాపాత్రో నాయకత్వంలో రాష్ట్రంలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక దృష్టి పెట్టిన అధిష్టానం ఈ మేరకు రాష్ట్ర ఇన్చార్జిగా వీరేంద్ర సింగ్ కడియాన్ను నియమించిందని అన్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు సహా ఇన్చార్జిలు బాధ్యతలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాయగడ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 182 గ్రామ పంచాయతీలు, 11 సమితులు, మున్సిపాలిటీలు, ఎన్ఏసీల్లో వార్డుల స్థాఽయిలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆప్ అమలు చేసిన విద్య, ఆరోగ్య, ఉచిత విద్యుత్, తాగునీరు, ఉపాధి రంగాల్లోని అభివృద్ధి నమూనాలను వివరిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాయగడ జిల్లాలో పార్టీని మరింత బలొపేతం చేసి ప్రజల మద్దతును కూడగట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్వయ్ వివరించారు.


