రాయగడ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు నందకిషోర్ చౌదరి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పూలమొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది శుభ్రా పండా, ఉపాధ్యాయుడు జయదేవ్ శేఠి, ట్రస్ట్ కార్యదర్శి దయానంద ఖడంగా, ఉపాధ్యక్షుడు ఎం.సురేష్కుమార్, సభ్యులు గీతారాణి మిశ్రా, ప్రతిమా పాడి, అమూల్యకుమారి మిశ్రా, జి.బ్రహ్మాజీ, సునంద జెనా, మనోజ్కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు.
హమ్మయ్యా.. బాలురు దొరికారు!
రాయగడ: ముగ్గురు చిన్నారులు తప్పిపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తమ పిల్లలు సురక్షితంగా తమచెంతకు చేరడంతో ఊపిరిపీల్చుకున్నారు. టికిరి దళిత వీధికి చెందిన గుడు నాయక్, సంజయ్ కులసిక, ప్రీతమ్ గరడ అనే ముగ్గురు బాలురు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అన్నిచోట్లా వెతికారు. దీంతో బాధితులు టికిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారుల వివరాలను ఇతర పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ క్రమంలో రాయగడ రైల్వే స్టేషన్లో జీఆర్పీ సిబ్బంది నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఫాట్ఫారంపై నిలిచి ఉన్న రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ముగ్గురు చిన్నారులు కనిపించారు. వారిని విచారించగా సరదాగా తిరగడానికి వచ్చినట్లు చెప్పారు. అనంతరం వారిని పోలీసులు బాలల సంక్షేమ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
పేద మహిళకు ఆర్థిక సాయం
మల్కన్గిరి: ఖోయిర్పూట్ సమితి ముదిలిపోడ పంచాయతీకి చెందిన కమలా మాఝి అనే మహిళకు కలెక్టర్ ప్రధమేవ్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈమె భర్త అనారోగ్యానికి గురికావడంతో బరంపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పేదరికం కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. ఈ నేపథ్యంలో అధికారులను ఆశ్రయించగా సాయం అందించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
మల్కన్గిరి : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత జీత్ కుసుమకుమార్ అన్నారు. గురువారం మల్కన్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మనోరంజాన్ త్రిపాఠి, కృష్ణ కుల్దీప్, చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


