పర్లాకిమిడి: గజపతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టు నవీకరణ పనులు రూ. 2.4 లక్షలతో అధికారులు పూర్తిచేశారు. బ్యాడ్మింటన్ కోర్టులో కోర్టు మరమ్మతులు, మ్యాట్ మార్పిడి ఇతర పనులను పూర్తిచేశారు. ఈ సందర్భంగా గజపతి ఇండోర్ స్టేడియంలో గజపతి బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు జిల్లా మేజిస్ట్రేటు ఫల్గునీ మఝి, జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయిక్, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి శాసనసభ్యులు రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు పూర్తిచేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే గజపతి జిల్లా పర్లాకిమిడిలో మరో రెండు ఇండోర్ స్టేడియంలు, ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొలి బ్యాడ్మింటన్ మ్యాచ్ రూపేష్ పాణిగ్రాహి ఆడి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో గజపతి బ్యాట్మింటన్ ఆటగాళ్లు మిరపల్లి ప్రసాద్, పైల క్రాంతి, ముఖేష్, కోండల్రావు, శ్యాంకుమార్, లాల్చెట్టి సంజయ్, విజయకుమార్ (చిన్ని), ఇంజా వెంకట రమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


