జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కెరమటి గ్రామ పంచాయతీ కాపుగుడలో గత 9 రోజుల నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. టోర్నమెంట్లో 16 టీమ్లు పాల్గొన్నాయి. ఫైనల్కు రాణిగుడ, జనకమాడి గ్రామాల టీమ్లు చేరాయి. టాస్ గెలిచిన రాణిగుడ టీమ్ 10 ఓవర్లలో 80 పరుగులు చేసి అల్ ఔటైంది. 81 పరుగుల విజయ లక్ష్యంతో ఆడిన జనకమాడి టీమ్ 6 ఓవర్లలో 81 పరుగులు చేసి విజయం సాధించింది. టోర్నమెంట్ బహుమతుల ప్రధాన ఉత్సవంలో కాంగ్రెస్ నేత అనామ దియాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలను బహుమతులతో సత్కరించారు. చాంపియన్ జట్టుకు రూ.10 వేల నగదు, ట్రోఫీ అందజేశారు. రన్నర్ టీమ్కు రూ.8 వేల నగదు ట్రోఫీ అందజేసి సన్మానించారు. బహుమతుల ప్రదానోత్సవంలో కుంద్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోకుల పట్నాయక్, కార్యదర్శి దైతారి మల్లిక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సాధారణ కార్యదర్శి రాజేష్ గురు, కుంద్ర పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర పొరజ, ఏఐసీసీ సభ్యులు లక్ష్మీకాంత పట్నాయక్ రాణిగుడ సర్పంచ్ శివ ప్రధాన్, గోపాల గౌడ, నంద హరిజన్ తదితరులు పాల్గొన్నారు.


