భువనేశ్వర్: రాజధాని భువనేశ్వర్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే నివాస సముదాయం నిర్మాణం పనుల పురోగతిని సమీక్షించేందుకు న్యాయ, ప్రజా పనులు, అబ్కారీ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరిచందన్ మొత్తం ప్రాంతాన్ని తనిఖీ చేసి, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సీనియర్ అధికారులకు, కాంట్రాక్టు ఏజెన్సీకి ఆదేశించారు. 6 టవర్లతో కూడిన ఈ నివాస సముదాయంలో మొత్తం 300 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో 105 టైప్ 7 ప్లాట్లు కాగా, 195 టైప్ 6 ప్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయంలో 130 మంది ఎమ్మెల్యేలు, 170 మంది సీనియర్ అధికారులు నివసిస్తారు. దీనితో పాటు, ప్రాంగణంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేందుకు పెద్ద చెట్లను నాటనున్నారు. అదేవిధంగా, అతిథుల కోసం 50 గదులతో కూడిన క్లబ్ హౌస్ నిర్మాణంపై చర్చలు జరిగాయి. ఈ నిర్మాణం పనులు ఈ ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్ధారించారు. సమావేశానికి ఎమ్మెల్యే బాబూ సింగ్, నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, ఓబీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ సాహాతో పాటు సీనియర్ శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ అధికారులు హాజరయ్యారు.


