భువనేశ్వర్: రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి ఆరోగ్యం కోలుకుంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆదివారం రాత్రి 8.30 గంటలకు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇటీవల ఛాతీ నొప్పితో చికిత్స కోసం స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి ఉన్నత చికిత్స కోసం న్యూ ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అక్కడి వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో మంత్రి సురేష్ కుమార్ పూజారికి బైపాస్ శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో న్యూఢిల్లీ నుండి భువనేశ్వర్కు తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హాజరు అత్యంత కీలకం. రాజ్యసభ ఎన్నికలకు ఒక రోజు ముందుగానే మంత్రి విచ్చేయడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఓటు కీలకం. ఈ పరిస్థితుల్లో ఆయన ఒక రోజు ముందుగా చేరడం విశేషం.
చెరువులో మునిగి
2వ తరగతి విద్యార్థిని మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మన్యంకొండ పంచాయతీ బాంజిగూడ గ్రామానికి చెందిన ముతా జాలి కుమార్తె శివాని (8) కొండమల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి పాఠశాల దూరం సుమారు 3 కిలోమీటర్లు ఉండటంతో పాటు అడవి, కొండల మార్గం ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఈ గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులను తన మోటార్ సైకిల్ పై పాఠశాలకు తీసుకెళ్లి తిరిగి గ్రామానికి చేర్చేవాడు. అలాగే శనివారం ఉదయం 6 గంటలకు ఉపాధ్యాయుడు విద్యార్థులను తీసుకెళ్లి, పాఠశాల అనంతరం 11గంటల సమయంలో తిరిగి గ్రామంలో దింపి తన ఇంటికి వెళ్లిపోయారు. గ్రామానికి వచ్చిన శివానీ తోటి పిల్లలతో కలిసి చెరువుకు వెళ్లింది. అక్కడ స్నానం చేస్తూ మునిగిపోయింది. తోటి బాలికలు అరుస్తుండగా కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొన్ని బయటకు తీసి రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలిసింది. మోటు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


