లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం– ఆంధ్ర ప్రదేశ్(జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ 2016 యూజీసీ పీఆర్సీ ఎరియర్స్ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైద్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. అంతేకాకుండా 2026 యూజీసీ పీఆర్సీ అయిన వెంటనే టీచింగ్ వైద్యులకు వర్తింపజేయాలన్నారు. వైద్యులు పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలనే పలు డిమాండ్లతో వైద్యులు ప్రతిరోజూ అరగంట పాటు విధులు బహిష్కరించి చేస్తున్న నిరసన 18వ రోజు కొనసాగింది.


