రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన వ్యక్తి మృతి చెందటాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్పీకి సమాచారం అందించారు. దీనిపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, ఇతరత్రా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.
రైలు కిందపడి వ్యక్తి
ఆత్మహత్య...
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గంగినేని రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై తీవ్ర గాయాలతో వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ జీఆర్పీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఇతరంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.


