గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో సైతం ప్రతిభావంతులుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు వై. మదన్మోహన్రావు అన్నారు. ఆంధ్రలయోల కళాశాలలో తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో సైతం నైపుణ్యాలను పెంచుకోవాలని కాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు విద్యా సంస్థల నుంచీ 500మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో గోల్డ్మెడల్ సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 21, 22, 23 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి ఎం. అంకమరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి బి. కాశీనాథ్ రెడ్డి, ఇంటర్నేషనల్ యోగా మెడలిస్ట్ బి. శిరీష తదితరులు పాల్గొన్నారు.


