ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం పది గంటల తర్వాత మరింత పెరిగింది. సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి మహానివేదనకు మధ్యాహ్నం గంట సేపు దర్శనాలు నిలిపేశారు. ఆ తర్వాత అన్ని లైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. అనంతరం దర్బారు సేవ, పల్లకీ సేవలను నిర్వహించగా, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది.


