పర్యాటకుల కోసం ఆంధ్రా ట్యాక్సీ యాప్
అందుబాటు ధరల్లో సురక్షిత విహారయాత్ర సేవలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకుల సౌకర్యార్థం ఆంధ్రా ట్యాక్సీ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షిత, సంతోషకర విహారయాత్ర సేవలను ఈ ప్రత్యేక యాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంధ్రా ట్యాక్సీ యాప్ను కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్యాక్సీ, ఆటో యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, పర్యాటక, రవాణా శాఖ అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సౌకర్యవంతమైన ప్రయాణానికి సరైన ఎంపిక ఆంధ్రా ట్యాక్సీ అని పేర్కొన్నారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా టూరిజం వివరాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, రవాణా సేవలు, సమీప పోలీస్ స్టేషన్కు అనుసంధానమైన ఎస్ఓఎస్ సేవలు తదితరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మొబైల్ యాప్తో పాటు క్యూఆర్ కోడ్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా కూడా ఆటో, ట్యాక్సీ తదితర సేవలను బుకింగ్ చేసుకునే వీలుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
అందుబాటులో టూరిజం ప్యాకేజీలు
జిల్లాకు సంబంధించి ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒకరోజు ప్యాకేజీలో దుర్గగుడి, బెరం పార్కు, కొండపల్లి కోట, పవిత్రసంగమం (ఫెర్రీ ఘాట్), భవానీ ఐలాండ్, బాపూ మ్యూజియం, గాంధీ హిల్ ఉంటాయన్నారు. మిగిలిన ప్యాకేజీల పూర్తి వివ రాలు యాప్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యాటకులకు సేవలు అందించేందుకు ఇప్పటికే ఔత్సాహిక యువకులకు గైడ్లుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లే పర్యాటక రాయబా రులేనన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారిని సముచిత రీతిలో సత్కరిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అనంతరం యాప్లో రైడ్బుక్ చేసుకుని కలెక్టర్ లక్ష్మీశ ఆటోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఇన్చార్జ్ ఆర్టీఓ కె.వెంకటేశ్వరరావు, విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.సాయిప్రసాద్, కోర్ కమిటీ సభ్యుడు వి.బాబూరావు, రాష్ట్ర ఆటో ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిబాబు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


