ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రయివేటీకరణ కానివ్వం
●ప్రభుత్వ ఆస్తులను వైఎస్సార్ సీపీ కాపాడుతుంది ●ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి
సాక్షి,అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణ ఒక పెద్ద కుట్ర అని, అన్ని కుంభకోణాల్లో కల్లా ఇది మాస్టర్ కుంభకోణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రయివేట్ పరం కానివ్వబోమని, తమ పార్టీ న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణలో వెనక్కు తగ్గబోం అన్నట్లుగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ విషయంలో వచ్చే ప్రజావ్యతిరేకతను సీఎం చంద్రబాబు లెక్క చేయటం లేదని, ప్రజలతో తనకు సంబంధం లేదన్నట్లుగా ముందుకెళ్తున్నారని కారుమూరి విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ ప్రయివేట్ వారికి అప్పగిస్తాం.. ఏమైనా చేయగలరా? అంటూ అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోవాలంటే చాలా కష్టమనే విషయాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాలు సేకరించి గవర్నక్కి అందజేశారని, వాటిని కోటి సంతకాలుగా కాకుండా కోటి కుటుంబాల మద్దతుగా చూడాలని కోరారు. చంద్రబాబు మెండిగా వెళ్తే కచ్చితంగా తాము హైకోర్టుకు వెళ్లి, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని ప్రభుత్వం తీసుకొంటుందని, విచారించి అందులో భాగస్వాములైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ‘ప్రయివేట్ వారు మెడికల్ సీట్లు అమ్ముకొంటారు.. ప్రజల దగ్గర ఓపీ ఫీజు వసూలు చేస్తారు .. ప్రభుత్వం మాత్రం జీతాలు చెల్లిస్తుంది. ఇది చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన కుట్ర. ఇందులో ప్రయివేట్ వారు భాగస్వాములు అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని’ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒంటరిగా మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళ మెడలో చైన్ లాక్కుని వెళ్లిన స్నాచర్ను విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాధరపురానికి చెందిన పబ్బతి శ్రీదేవి రోజూ ఉదయం వాకింగ్కు వెళ్తుంది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చి ఆమె మెడలోని 5 కాసుల చైన్ లాక్కెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తి గుణాపు సాయి అలియాస్ రంగాసాయిగా గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి 5 కాసుల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు.
తెనాలి రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్ ఉళ్లక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్ హెల్త్ ఇన్ మిడ్ లైఫ్’ అనే అంశంపై డాక్టర్ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరప్రసాద్, డాక్టర్ జి.రవిశంకరరావు, డాక్టర్ టి.అఖిలేష్, డాక్టర్ కె.అనిల్ కుమార్, డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.


