
పెసలు రైతులకు సొమ్ము జమ
● సేకరణ ప్రక్రియ మరింత ముమ్మరం ● ఇప్పటికే 938 టన్నులు సేకరణ
కంకిపాడు: ఎట్టకేలకు పెసల రైతులకు సొమ్ము జమ అవు తోంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము బదిలీ చేసేలా మార్క్ఫెడ్ అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. ‘పెసర రైతుకు కొనుగోడు కేంద్రాలు’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురిత మైంది. పెసలు కొనుగోలు జరుగుతున్నా.. సొమ్ము లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని వివరించింది. దీంతో స్పందించిన మార్క్ఫెడ్ అధికారులు జిల్లా స్థాయిలో నివేదికను సేకరించి ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు రూ. 4.81 కోట్ల సొమ్ము రైతు ఖాతాలకు జమ చేశారు.
ముమ్మరంగా సేకరణ..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో మూడు వేల హెక్టార్లలో పెసర పంట సాగు జరిగింది. మార్కెట్లో ధర ఆశాజనకంగా లేకపోవటంతో మార్క్ఫెడ్ పంట సేకరణకు చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను తెరచి సేకరణ ప్రక్రియ చేపట్టింది. క్వింటాకు రూ.8,682 చొప్పున మద్దతు ధర అందించేలా కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. ఆయా కేంద్రాల ద్వారా 438 మంది రైతుల నుంచి 938 టన్నులు పెసలు సేకరించారు. రూ. 7,34,14,992 విలువైన పెసలు సేకరించి గోదాములకు తరలించారు. ఇందులో రూ. 4.81 కోట్లు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
విడతల వారీగా జమ..
పెసలు సేకరణ లక్ష్యానికి అనుగుణంగా సాగుతోంది. రైతులు మద్దతు ధర కోసం స్థానికంగా అందుబాటులో ఉంచిన కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకోవచ్చు. రూ. 4.81 కోట్లు రైతులకు సొమ్ము జమ అయ్యింది. మిగిలిన సొమ్ము విడతల వారీగా రైతులకు అందుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్

పెసలు రైతులకు సొమ్ము జమ