
ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ జి. లక్ష్మీశ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, పర్యటన విధులు నిర్వర్తించే రూట్ ఆఫీసర్లు, లైజనింగ్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లతో మంత్రి సత్యకుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
విజయవంతం చేద్దాం..
మంత్రి మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ రాజధాని లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో సభా వేదికకు జిల్లా నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్య వైద్య వివిధ రంగాలకు చెందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాలన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమష్టి భాగస్వామ్యంతో ప్రధాన మంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రధాన మంత్రి పర్యటనకు జిల్లా నుంచి చేసిన ఏర్పాట్లను మంత్రికి వివరించారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీవో కె. చైతన్య ఉన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్