పది మందికి సమానం..
నందిపేట్(ఆర్మూర్): దాదాపు 20 వేల జనాభా గల నందిపేటలో డ్రెయినేజీలు, రోడ్లు, సోమవారం సంత రోజు ఏర్పడే చెత్తను శుభ్రం చేసేందుకు కార్మికులు సరిపోవడం లేదు. దీంతో మేజర్ గ్రామపంచాయతీ కావడం వల్ల రోడ్లను శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో రోడ్లను శుభ్రం చేసేందుకు పాలకవర్గం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. అయితే దీనికి భిన్నంగా నందిపేట పాలకవర్గం రోడ్ల క్లీనింగ్ కోసం వినూత్నంగా ఆలోచించి ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది.
ఒకేసారి నాలుగు చీపుర్లు..
గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు వెనుక తేలికగా 360 డిగ్రీలలో తిరిగే యంత్రాన్ని తయారు చేయించారు, దానికి నాలుగు వైపుల పెద్ద చీపుర్లు అమర్చారు. ట్రాక్టర్ మోటారు సహాయంతో ఆ నాలుగు చీపుర్లు తిరుగుతూ రోడ్డును చక్కగా శుభ్రం చేస్తుంటాయి. అంతేగాక రోడ్డుపై ఉన్న చెత్తను ఒక పక్కకు తోస్తుంటాయి. ఈ యంత్ర ఉపయోగం వల్ల పారిశుధ్య కార్మికుల కొరత తీరుతుంది. దీంతోపాటు సుమారు పది మంది చేసే పనిని ఈ యంత్రం సులభంగా చేయడంతో గ్రామ పంచాయతీకి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతిరోజు సుమారు 6 కిలోమీటర్ల వరకు ప్రధాన రోడ్డుతో పాటు పలు వీధులను శుభ్రం చేస్తుంది. గత కొన్ని రోజులుగా మట్టితో నిండి ఉన్న రోడ్లన్నీ ఈ యంత్రం సహాయంతో శుభ్రంగా కనిపిస్తున్నాయి.
నందిపేట గ్రామాన్ని స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో మా పాలకవర్గం ముందుకు వస్తుంది. పది మంది కార్మికులు చేసే పనిని ఈ ఒక్క యంత్రం చేస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల కొరత కూడ తీరుతుంది. జీపీలో ఉన్న 25 మంది కార్మికులతో ఇతర పనులు చేపడుతున్నాం.
– ఎర్రం లింగం, సర్పంచ్, నందిపేట
నందిపేటలో పారిశుద్ధ్య కార్మికుల కొరత
రోడ్లను శుభ్రం చేసేందుకు
తీవ్ర ఇబ్బందులు
ఆధునిక యంత్రం ఏర్పాటుతో
ఇక్కట్లు దూరం


