● వారం రోజులుగా ‘పాత పట్టణం’లో
ప్రజల ఇబ్బందులు
● పట్టించుకోని అధికారులు
కామారెడ్డి టౌన్ : వారం రోజులుగా తాగునీటి కోసం కామారెడ్డి పాత పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు వార్డుల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. గడి రోడ్లోని వాటర్ ట్యాంకర్ వద్ద పంపు మోటారు చెడిపోవడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో 26, 27, 28, 45, 46, 47 వార్డుల పరిధిలో చుక్క నీరు రాక ప్రజల తంటాలు పడుతున్నారు. కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్లను నిలదీస్తున్నారు. దీంతో కౌన్సిలర్లు సొంత ఖర్చులతో ట్యాంకర్లను తెప్పించి నీటిని సరఫరా చేయిస్తున్నారు. సమస్యపై బల్దియా అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి మోటారు రిపేరు చేయించకపోతే, కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాకు దిగుతామని ఆయా వార్డుల కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.
26, 27వ వార్డులో ట్యాంకర్ ద్వారా నీటిని పట్టుకుంటున్న ప్రజలు


