మెరుగైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యత

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

బోధన్‌: వినియోగదారులుకు, వ్యవసాయానికి మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో విద్యు త్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటివరుణ్‌ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఎడపల్లిలోని 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఎడపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. జైతాపూర్‌, పోచారం ఫీడర్స్‌ ప్రాంతాల్లో 11 కేవీ లైన్‌ దూరంగా ఉందని, బాపునగర్‌ వద్ద విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా.. సానుకూలంగా స్పందించిన సీఎండీ.. ప్రతిపాదనలు పంపించాలని ఎస్‌ఈ, డీ ఈలను ఆదేశించారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఎడపల్లి సబ్‌ స్టేషన్‌ను మరో 20 ఏళ్లు పటిష్టంగా ఉండేలా అభివృద్ధి చేసిన సివిల్‌, ఆపరేషన్‌ విభాగాలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటిస్థానంలో సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్స్‌ విధానంలో లైన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను శాఖా పరంగా ఎలాంటి రుసుము లేకుండా సమకూరుస్తున్నామని తెలిపారు. ప్రాణం అమూల్యమైందని, భద్రత నియమాలు పాటిస్తూ పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయనవెంట ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌, డీఈ ఆపరేషన్‌ (బోధన్‌) ముక్తార్‌, కన్స్‌స్ట్రక్షన్‌ డీఈ వెంకటరమణ, తోట రాజశేఖర్‌, ఏడీఈ ఆపరేషన్‌ ఎడపల్లి సబ్‌ డివిజన్‌ ప్రభాకర్‌, ఏఈ కిశోర్‌ రెడ్డి, ఈఈ సివిల్‌ స్వామి, ఏఈ కన్స్‌స్ట్రక్షన్‌ సుమిత, ఎడపల్లి, రెంజల్‌ ,బోధన్‌ మండలాల సిబ్బంది పాల్గొన్నారు.

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి చేయాలి

బోధన్‌రూరల్‌ / నవీపేట : నిరంతర విద్యుత్‌ సరఫరా, వినియోగదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి సూచించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన బోధన్‌ సబ్‌ స్టేషన్‌, డివిజన్‌ కార్యాలయం, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవీపేట మండలంలోని హనుమాన్‌ ఫారం గ్రామ శివారులో జరుగుతున్న 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్‌ పనులను సీఎండీ వరుణ్‌రెడ్డి పరిశీలించారు.

సబ్‌స్టేషన్‌ పనులు ప్రారంభించాలి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): తమ గ్రామానికి మంజూరైన సబ్‌స్టేషన్‌ పనులు త్వరగా ప్రారంభించాలని డొంకేశ్వర్‌ మండలం నికాల్‌పూర్‌ గ్రామస్తులు సీఎండీ వరుణ్‌రెడ్డిని కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. నికాల్‌పూర్‌ గ్రామానికి లో వోల్టేజ్‌ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం సబ్‌స్టేషన్‌ కోసం రూ.2.53 కోట్లు మంజూరు చేయగా, ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు మొదలు కాలేదన్నారు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. సుమన్‌, సుభాష్‌, శ్రీధర్‌రెడ్డి, నవీన్‌, శ్రీధర్‌ ఉన్నారు.

క్షేత్రస్థాయిలో వ్యవస్థను

పటిష్టం చేస్తున్నాం

ఇనుప స్తంభాల స్థానంలో

సిమెంట్‌ స్తంభాలు

టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ

కర్నాటి వరుణ్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement