● భర్తను హత్య చేసిన భార్య
● ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
● నిందితురాలు సహా సహకరించిన
ఇద్దరు రిమాండ్
మోపాల్(నిజామాబాద్రూరల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది ఓ భార్య. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులను అ దుపులోకి తీసుకున్నారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ (35) జూన్ 27న సౌదీ అరేబియా నుంచి న్యాల్కల్కు తిరిగొచ్చాడు. అప్పటికే భార్య సంధ్య నగరంలోని ఇంద్రాపూర్కు చెందిన మిరుగూరి అనిల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త రావడంతో సంధ్య, అనిల్కు మింగుడు పడలేదు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు. హ త్యకు పక్కా ప్రణాళిక రచించారు. కుట్రలో భాగంగా న్యాల్కల్కు చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి సహకారం కోరగా అంగీకరించాడు. 29న వెంకటసాయి, ప్రశాంత్ కలిసి ఇంట్లోనే మ ద్యం సేవించారు. ఫుల్గా మద్యం తాగిన తర్వాత సంధ్య సహకారంతో ప్రశాంత్ను డాబాపైకి తీసుకెళ్లి కిందికి తోసేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సంధ్య, వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి అనిల్ సైతం రాగా, అదేరాత్రి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి అనిల్ ప్రోత్సాహంతో సంధ్య ముందుగా దాచిన మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారు చేసిన ఇంజెక్షన్, టాయిలెట్ క్లీనర్ను ప్రశాంత్కు కాన్యూలా ద్వారా ఎక్కించారు. ఆ తర్వాత మంచంపై నుంచి కిందకు తోసి హత్య చేశారు.
తొలుత ప్రమాదంగా..
ప్రశాంత్ చనిపోయాడని నిర్ధారించుకున్న సంధ్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి ప్రమాదంగా కేసు నమోదు చేసే క్రమంలో కొడుకు మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లి.. కోడలు సంధ్యపై అనుమానం వ్యక్తంచేసింది. తల్లి శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం, మృతి చెందిన విషయం కూడా తనకు తెలియలేదని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న ఎస్సై జాడె సుస్మిత మృతుడి భార్య సంధ్య, వెంకటసాయి (బంటి)ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారు. సంధ్య, వెంకటసాయి, అనిల్ను రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎస్సై జాడె సుస్మిత పాల్గొన్నారు.


