● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో ఆయిల్ పామ్ సా గు విస్తీర్ణం పెంపొందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ సీజన్లో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ ల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వాహకులైన ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ స మీక్ష నిర్వహించారు. నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పా టుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటను సేకరించే సెంటర్లను రైతులకు అనువైన ప్రాంతాలలో అందుబాటులో ఉంచాలని ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రధానంగా మాక్లూర్, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ మండలాలపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఒక్కో మండలంలో కనీసం 100 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చూడాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ రాయితీలు, మద్దతు ధర, ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగు తదితర అంశాలను వివరించాలన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, ప్రీ–యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయికిరణ్ పాల్గొన్నారు.


