రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఏకచక్రనగర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్లో నివాసం ఉంటున్న షేక్ హుస్సేన్ (62) ఏకచక్ర నగర్ చౌరస్తా నుంచి నడుచుకుంటు వస్తుండగా ఓ టిప్పర్ బాబా గార్డెన్ నుంచి బోధన్ వైపునకు వస్తోంది. ఏకచక్రనగర్ చౌరస్తా వద్ద హుస్సేన్ను టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఢీకొనగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే తన తండ్రి మృతి చెందినట్లు మృతుడి కొడుకు షేక్అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
రుద్రూర్: మండల కేంద్రంలో రహదారిపై ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో బోర్లపడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీకి చెందిన సంజీవ్ కుమార్ (44) గత ఏడేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని హైస్కూల్కు వెళ్లే దారిలో సంజీవ్ కుమార్ ఫిట్స్ వచ్చి బోర్లపడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. జక్రాన్పల్లి ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సికింద్రాపూర్ గ్రామ పరిఽధిలోని జాతీయ రహదారి డివైడర్లో కార్మికులు గార్డెనింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో కామారెడ్డి నుంచి నాగ్పూర్ వెళ్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో వర్కర్లు బదవత్ నరేష్, లింబాద్రి, శ్రీకాంత్లకు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బదవత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


