● జిల్లాకు రూ.44.23 కోట్లు
విడుదల చేసిన ప్రభుత్వం
డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వాపస్ చేసింది. ఈ మేరకు జిల్లాలో 19,291 సంఘాలకు కలిపి రూ.44.23 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను మండలాల వారీగా ఆయా ఎస్హెచ్జీ గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న తెలిపారు. గ్రామీణ మహిళలు ఎస్హెచ్జీ సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం రుణాలు పొందుతూ ప్రతి నెలా వాయిదాల రూపంలో తిరిగి రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తున్నారు. మహిళలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తిరిగి వడ్డీ డబ్బులను వారికి అందజేస్తోంది. అయితే.. చివరి సారిగా 2025 జనవరి వరకు వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. ప్రస్తుతం 2025 ఫిబ్రవరి నుంచి 2025 నవంబర్ వరకు కలిపి మొత్తం పది నెలల వడ్డీని మహిళా సంఘాలకు అందజేసింది. త్వరత్వరగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం వాపస్ చేయడంతో మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.


