● సిరికొండ రేంజ్లో కొరడా ఝుళిపించిన ఫారెస్ట్ అధికారులు
● భారీ పోలీసు బందోబస్తు నడుమ భూమి చుట్టూ ట్రెంచింగ్
సిరికొండ: ఆక్రమణకు గురైన అటవీ భూమిని ఆ శాఖ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సిరికొండ రేంజ్ రావుట్ల సెక్షన్ పరిధిలోని రావుట్ల, జంగిలోడితండాల వద్ద అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. 10 పొక్లెయిన్ లను తీసుకువచ్చి ఆక్రమిత భూమి చుట్టూ కందకం తవ్వించారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్యాదవ్ నేతృత్వంలో పది మంది సీఐలు, 26 మంది ఎస్సై లు వందలాది మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో ఎటు చూసినా పోలీసులే కనిపించారు. ఆర్మూర్ ఎఫ్డీవో చంద్రశేఖర్రావు భూముల స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచనల మేరకు అటవీభూమిని పరిశీలించి ఆక్రమణకు గురైన 55 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆక్రమణదారులకు వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేశామని, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నోటీసులకు తిరిగి సమాధానం ఇవ్వలేదన్నారు. సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగ్రావు, ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


