ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉర్దూ బోధన అంశంపై విచారణ కొనసాగుతోంది. మండల విద్యాధికారి రాజగంగారాం బుధవారం పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, యాజమాన్యాన్ని విచారించారు. ఈ ఘటనపై ఇప్పటికే యాజమాన్యం, ఒక వర్గానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో ఒక పేరుతో అప్పర్ ప్రైమరీ స్కూల్, మరో పేరుతో హైస్కూల్కు అనుమతులు తీసుకొని పాఠశాలలు నిర్వహిస్తున్న తీరుపై సైతం ఎంఈవో విచారణ చేపట్టారు. పూర్తి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని ఎంఈవో రాజగంగారాం తెలిపారు.


