మోపాల్ : మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయని ప్రశాంత్ (35) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత బుధవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. ప్రశాంత్ ఇటీవల సౌదీ అరేబియా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. జూన్ 29న సాయంత్రం బంటి అనే వ్యక్తితో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆయన భార్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకురాగా, పరిస్థితి విషమించి 30న సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి దాయని శ్యామల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాముకాటుతో మరో యువకుడు ..
బోధన్రూరల్: మండలంలోని అమ్దాపూర్ గ్రామానికి చెందిన అంబం శ్రీకాంత్ (19) ఇంట్లో పాముకాటు వేయగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బుధవారం మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్అర్బన్: వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పీ శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట నకిలీ అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కార్డు సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయబడలేదని స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యక్తి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ, బోగస్ అక్రెడిటేషన్ కార్డులు తయారు చేయడం, వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


