● జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీ తీర్మానం
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి డొంకేశ్వర్ మండలంలో మరో గ్రామ పంచాయతీ ముందుకొచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపితే రెండేళ్ల పాటు ఇంటి పన్నును రద్దు చేస్తామని జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీ ప్రకటించింది. ఈమేరకు సర్పంచ్ బట్టు సంజీవ్రాజ్, ఉప సర్పంచ్ కోరొళ్ల మహిపాల్, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు కలిసి మంగళవారం జీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి తీర్మానించారు. పిల్లలను పంపకపోతే మన ఊరి బడి తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిని కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలందరిపై ఉందన్నారు. కావునా ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపి రెండేళ్ల పాటు ఇంటి పన్ను రద్దు ఆఫర్ను పొందాలని సర్పంచ్ కోరారు. అయితే, ఇలాంటి నిర్ణయమే ఇటీవల మండలంలోని తొండాకూర్ గ్రామ పంచాయతీ కూడా తీసుకుంది.


