● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● 122 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 122 ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్నకు అర్జీలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు, విద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధిగా సందర్శిస్తూ సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
బలవంతంగా ఉర్దూ భాషను విద్యార్థులకు బోధిస్తున్న ఆర్మూర్లోని ఓ ప్రయివేటు హైస్కూల్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్ అదనపు కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. కోటార్మూర్ ప్రాంతంలోని హైస్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, చెర్రీ, కుల్వంత్, సౌరభ్, దీపాన్, సిద్దు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ స్కూల్కు స్థలం కేటాయించాలి
బోధన్లోని నర్సింగ్ స్కూల్కు ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అసౌకర్యాలు ఉన్న బోధన్ ఆస్పత్రిలో నర్సింగ్ స్కూల్ కొనసాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా కమిటీ సభ్యులు సుజిత్, అక్షయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


