టెక్నాలజీ ఎంత పెరిగినా, వాతావరణ శాఖ ఎన్ని చెప్పినా, పల్లె ప్రజలు మాత్రం వాన కోసం అనాదిగా వస్తున్న ఆచారాలనే నమ్ముకుంటారు. ఇది కేవలం ఆచారం కాదని, ఎండిన నేల తడవాలని కోరుకునే కోటి గొంతుకల ఆరాటమని చెప్తున్నారు. దీంతో పలు పల్లెల్లో కప్పల పెళ్లికి ముహూర్తాలు ఖరారు అయ్యాయి. చెరువు గట్టున, కాలువ పక్కన రెండు కప్పలని పట్టుకొచ్చి డప్పు చప్పుళ్లతో ఊరేగిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు కప్పల బుట్టను దించి, మహిళలు నీళ్లు చల్లి, అక్షింతలు వేసి ‘‘వాన పడాలి, పంట పండాలి’’ అని మొక్కుకున్నారు.


