ఖలీల్వాడి: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఈ ఏడాది మహిళల సమానత్వ హక్కులకు సూచికగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సైదా జైనబ్ అన్నారు. శనివారం నగరంలోని నాగారంలో ఉన్న కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ నీటి దినోత్సవ వారోత్సవ గోడ ప్రతులను ఆవిష్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఈనెల 22న నిర్వహించే ప్రపంచ నీటి దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఈ ఏడాది మహిళల సమానత్వ హక్కులకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కళాశాల తరఫున వృక్షశాస్త్రం విభాగాధిపతి మౌనిక ఆధ్వర్యంలో ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుందని, దీనిని అధిగమించే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, అధ్యాపకులు మౌనిక, దీపిక, హీన, ప్రత్యూష, నవత, జాగృతి, సుమాంజలి పాల్గొన్నారు.


