నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు
● ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ
ఏర్పాట్లు చేశాం
● 58 కేంద్రాలలో నిర్వహణ
● ‘సాక్షి’తో డీఐఈవో రవికుమార్
ఖలీల్వాడి: ‘ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫీజుల పేరిట హాల్టికెట్లు ఇవ్వని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. ఇంటర్నెట్ ద్వారా పొందిన హాల్టికెట్లతోనే విద్యార్థులు పరీక్షలు రాసుకోవచ్చు.’ అని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు?
జిల్లాలో మొత్తం 136 కళాశాలలు ఉండగా అందులో 133 ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు మొత్తం 58 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రంలో తాగు నీరు, ఫ్యాన్లు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ప్రాథమిక చికిత్స చేసేలా ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను అందుబాటులో ఉంచుతాం.
ప్రత్యేక బృందాలు
ఏం చేస్తాయి?
జిల్లాలో పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించేందుకు నాతోపాటు 8 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక హెచ్పీసీ, ముగ్గురు డీఈసీ సభ్యులు పనిచేస్తారు. సభ్యులు ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలిస్తారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేస్తాం.
పరీక్షలకు ఎంత మంది హాజరుకానున్నారు?
జిల్లాలో మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 16,336, ఒకేషనల్ విభాగంలో 2,963 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 14,893, ఒకేషనల్ విభాగంలో 2771 మంది పరీక్షలు రాయనున్నారు.
నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు


