వేర్వేరు ఘటనలు.. విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● బట్టలను ఇస్త్రీ చేస్తుండగా ఒకరు.. బీరువాను తాకి మరొకరు మృతి
● వడ్లం గ్రామంలో విషాదఛాయలు
పెద్దకొడప్గల్: పెద్దకొడప్గల్ మండలంలోని వడ్లం గ్రామంలో రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్కురి నాగయ్య(48) అనే వ్యక్తి కౌలాస్ ప్రాజెక్ట్లో లస్కర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో బట్టలను ఇస్త్రీ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మి(41) అనే మహిళ ఇంట్లో ఉన్న బీరువాలో వస్తువులను తీస్తుండగా పైన ఉన్న విద్యుత్తీగ బీరువాకు తగలగంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నాగయ్య భార్య సావిత్రి, పసుపుల లక్ష్మి తల్లి సత్యవ్వ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని, గ్రామంలో ఇద్దరి మృతికి విద్యుత్ శాఖ అధికారులదే బాధ్యత అని గ్రామస్తులు, మాజీ ఉససర్పంచ్ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విషయమై ట్రాన్స్కో ఏడీఈ అరవింద్ను వివరణ కోరగా గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్య లేదని, విచారణ చేపడతామని ఆయన తెలిపారు.
వేర్వేరు ఘటనలు.. విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి


