విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు
సుభాష్నగర్ : వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, వి ధులలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని సైతం కలెక్టర్ సందర్శించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని, అత్యవసరమైతేనే సీ సెక్షన్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు ఎల్.రాములు, డా.జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.
● ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని
పెంపొందించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి


