బాప్రే.. యూరియా యాప్
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూరియా బుకింగ్ యాప్’ రైతులను పరేషాన్ చేస్తోంది. జిల్లాలో ఎక్కడి నుంచైనా బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. అధికారులు ఆన్లైన్లో స్టాక్ కేటాయించిన క్షణాల్లోనే యూరియా బస్తాలు మాయం అవుతున్నాయి. పక్క మండలాలు, గ్రామాల్లో స్టాక్ ఎక్కడ అందుబాటులో ఉందో యాప్లో చూసుకొని బుక్ చేసి వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో తమకు యూరియా దొరకడం లేదని స్థానిక రైతులు ఆందోళనతో వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఆగ్రహంతో నేరుగా వారి కార్యాలయాలకు వెళ్తున్నారు. యాప్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. గందరగోళ పరిస్థితి చూసి క్షేత్రస్థాయిలో ఉంటున్న ఏఈవోలు, ఏవోలు సైతం తలలు పట్టుకుంటున్నారు.
75,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి
యాసంగి సీజన్ పంటలకు జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు జిల్లాకు 77 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా దిగుమతి కాగా ఇందులో 75,500 మెట్రిక్ టన్నులు అమ్ముడు పోయింది. ప్రస్తుతం 1,500 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాలో స్టాక్ ఉంది. యాసంగి సీజన్కు కావాల్సిన కోటా దాదాపు అయిపోయినప్పటికీ రైతులు ఇంకా యూరియా కొనుగోలు చేస్తున్నారు. యాప్ రావడంతో యూరియా దొరకదనే అపోహతో రైతులు వచ్చే ఖరీఫ్కు కూడా ఇప్పుడే తీసుకొని పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్ వచ్చిన పది రోజుల్లోనే 7,529 మెట్రిక్ టన్నుల (1,67,323 బస్తాలు) యూరియాను 59,174 మంది రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయశాఖ వివరాలు వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో యూరియా సేల్ అవడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.
మార్పులు చేస్తే బెటర్..
బుకింగ్ విధానంతో కొత్త చిక్కులు
కేటాయించిన వెంటనే
అయిపోతున్న స్టాక్
పక్క మండలాలు, గ్రామాల నుంచి తెచ్చుకుంటున్న రైతులు
స్థానిక రైతులకు దొరకడం
లేదని ఆందోళన
కొన్ని రోజులే ఇబ్బందులు
యూరియా యాప్ విధానం ఇటీవలే ప్రభుత్వం అ మల్లోకి తేవడంతో రైతులు కొంత ఇబ్బందులు ప డుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొన్ని రో జుల మట్టుకే ఈ సమస్య ఉంటుంది. వేరే ప్రాంతా ల రైతులు బుక్ చేసుకోవడంతో స్థానికంగా ఉన్న వారికి దొరకడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
పంటలకు యూరియా వాడకం తగ్గించడంతోపాటు రైతులు సులభంగా బస్తాలు పొందడానికి ప్రభుత్వం బుకింగ్ యాప్ విధానాన్ని ఈ నెల 11 నుంచి పక్కాగా అమలు చేస్తోంది. యాప్ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న రైతులు ఎకరానికి మూడు బస్తాల వరకు వారికి కావాల్సిన సొసైటీలు, డీలర్ల వద్ద పొందటానికి అవకాశం కల్పించింది. ఓటీపీలు చెప్పడం, కావాల్సిన డీలర్ల దగ్గర స్టాక్ చూపకపోవడంతో వరికి మూడో డోసు చల్లే రైతులకు యూరియా సమయానికి దొరడం లేదు. అయితే, ప్రభుత్వం బుకింగ్ విధానంలో మార్పు తేవాలని రైతులు, అధికారులు కోరుతున్నారు. మండలం, సొసైటీ పరిధిలోని రైతులు అదే ప్రాంతంలోని డీలర్ల వద్ద బుకింగ్ చేసుకునేలా యాప్లో మార్పులు చేయాలంటున్నారు. దీంతో ఒక మండలానికి చెందిన రైతులు మరో మండలంలో తీసుకునే అవకాశం ఉండదని, అప్పుడు స్థానిక రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియాను పొందవచ్చని చెప్తున్నారు.
బాప్రే.. యూరియా యాప్


