తెయూ ఆర్ట్స్ డీన్గా మూసా ఖురేషి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్గా ప్రొఫెసర్ మహమ్మద్ మూసా ఖురేషి నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఎం.యాదగిరి గురువారం మూసా ఖురేషీకి నియామక ఉత్తర్వులు అందజేశారు. తెయూ ఉర్దూ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న మూసా ఖురేషీ గతంలో పలు అకడమిక్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. డీన్గా బాధ్యతలు స్వీకరించిన మూసా ఖురేషీని పలువురు అధ్యాపకులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ట్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలకు తన వంతు కృషి చేస్తానన్నారు. డీన్గా బాధ్యతలు స్వీకరించిన మూసా ఖురేషీకి అభినందనలు తెలిపిన వారిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ లక్షణచక్రవర్తి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, మాజీ డీన్ ప్రొఫెసర్ కె.లావణ్య, ప్రొఫెసర్ పి.కనకయ్య, అధ్యాపకులు గుల్–ఏ–రాణా, సమత, అతీఖ్ సుల్తాన్, పీఆర్వో రమణాచారి, జమీల్ అహ్మద్, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు.


