బాల్కొండకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేనా..?
ప్రాధాన్యత ఇవ్వాలి
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మంజూరు చేసింది. అయితే, బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు మంజూరవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తన సొంత గ్రామంలోని రూ.6 కోట్ల విలువైన భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వానికి ఇచ్చానని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భీమ్గల్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తన సొంత గ్రామం రహత్నగర్లో నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ స్థలాన్ని కేటాయించారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 6న శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాల కోసం రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
అయితే, బాల్కొండ నియోజకవర్గంలో స్థలాన్ని కేటాయించినా ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. పీసీసీ అధ్యక్షునితోపాటు మూడు కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, సుంకెట్ అన్వేష్రెడ్డి, సీఎంకు సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ ముత్యాల సునీల్రెడ్డిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే. హేమాహేమీలు అంతా బాల్కొండ నియోజకవర్గంలో ఉండగా ఈ ప్రాంతానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయకపోవడంపై విద్యాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతలు అంతా కలిసి సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకురావాలని కోరుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ఒకే రకమైన ప్రాధాన్యతను కల్పించాలి. అన్ని చోట్లా పాఠశాలలను నిర్మించి విద్యా సౌకర్యాలను విస్తృతం చేయాలి. – నల్ల నవీన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
జిల్లాలో మూడు నియోజకవర్గాల పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లు కేటాయింపు
బాల్కొండకు స్థలాన్ని కేటాయిస్తున్నట్లు
ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు
ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు
బాల్కొండకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేనా..?


