వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి, ఇంటర్మీడి యట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 24,542 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు, ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది, మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సెంటర్లలో నియమించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని సూచించారు. కేంద్రాలలోకి సెల్ఫోన్లను అనుమతించకూడదన్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, అవకతవకలకు తావు కల్పించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, ఏసీపీ మస్తాన్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
లీకేజీలు, అక్రమాలకు తావు కల్పిస్తే
కఠిన చర్యలు
కలెక్టర్ ఇలా త్రిపాఠి
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం


