ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరి మృతి
మద్నూర్లో వృద్ధురాలు..
మద్నూర్(జుక్కల్): ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మద్నూర్లో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రేకుల్వార్ సాయవ్వ(76) అనే వృద్ధురాలు సోమవారం గ్రామ శివారులోని సోమలింగాల శివాలయానికి నడుచుకుంటు వెళ్తుండగా దారిలో ఉన్న మైసమ్మ చెరువులో కాలు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగింది. ఉదయం మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కోడలు సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నాపూర్ గ్రామంలోని హన్మాన్ చెరువులో పడి పశువుల కాపరి పాట్రోలు మాణిక్యం (38) మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన మాణిక్యం నాలుగైదు నెలల క్రితం ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి చిన్నాపూర్కు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనుల్లో భాగంగా మంగళవారం గేదెలు, ఆవులు మేపేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు కట్టపై బట్టలు ఉంచి నీటిలోకి దిగాడు. చెరువులోని గుంతలో పడిపోయిన మాణిక్యానికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయన పిల్లలు గమనించి స్థానికులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరి మృతి


