బీరువానే ఎత్తుకెళ్లారు..
కామారెడ్డి క్రైం: సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసి, బీరువా తాళాలు పగలగొట్టి నగదు, నగలు దోచుకుంటారు. కానీ, జిల్లా కేంద్రంలో దొంగలు ఏకంగా బీరువానే భుజాన వేసుకొని తీసుకెళ్లిన వింత ఘటన సోమవారం వేకువజామున వెలుగుచూసింది. పాత ఎస్పీఆర్ కాలనీకి చెందిన షమీమున్నిసా అనే మహిళ తన ఇంటికి తాళం వేసి వెళ్లగా, గమనించిన ముగ్గురు ముసుగు దొంగలు సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. నగలు తీయడం ఆలస్యమవుతుందని భావించారో ఏమో గానీ, ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చి చూసిన బాధితురాలు దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు, కాలనీవాసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎక్కడా బీరువా ఆచూకీ లభించలేదు. బీరువాలో దాచి ఉంచిన రెండు తులాల బంగారం, కొంత నగదు అపహరణకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో ముగ్గురు
దొంగల హల్చల్
రెండు తులాల బంగారం,
నగదు అపహరణ
పాత ఎస్పీఆర్ కాలనీలో ఘటన


