నేడు తేలనున్న భవితవ్యం
● ఆర్మూర్లో 36 వార్డులు, 153 మంది అభ్యర్థులు బరిలో..
● విజయం ఎవరిని వరిస్తుందో..!
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో పోటీపడ్డ 153 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది. పట్టణంలోని 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి 36 మంది, బీజేపీ నుంచి 33 మంది, బీఆర్ఎస్ నుంచి 35 మంది, ఎంఐఎం నుంచి నలుగురు, ఆప్ నుంచి నలుగురు, జనసేన నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి ఇద్దరు, స్వతంత్రులు 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు జరిగినప్పటికీ కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ, స్వతంత్య్ర అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఎన్నికల అధికారులు నిర్వహించనున్న కౌంటింగ్లో అభ్యర్థుల జయాపజయాలు తేలనున్నాయి. ఆర్మూర్ పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది కౌంటింగ్ నిర్వహిస్తారు. సుమారు 50 మందికి పైగా అధికారులు కౌంటింగ్లో పాల్గొంటారు. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సరళిని అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాగి ఉన్న బ్యాలెట్ బాక్స్లను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా చేపట్టాలి
ఆర్మూర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించే బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ సూపవర్వైజర్లకు మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ రోజు ఏజెంట్లు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ ఏజెంట్ను బయటకు పంపించాలన్నారు. రికౌంటింగ్ లేకుండా ఒకేసారి జాగ్రత్తగా చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్లో కౌంటింగ్కు..
బోధన్టౌన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగనున్నందున పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని 38 వార్డుల్లో పోలింగ్ జరుగగా అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి భద్ర పరిచారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు 38 మంది, అసిస్టెంట్ సూపర్వైజర్లు 38 మంది ఉండగా ఏవోలు, ఏపీవోలు 26 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, కమిషనర్ జాదవ్ కృష్ణ, సీఐ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్ ఉన్నారు.
నేడు తేలనున్న భవితవ్యం


