పక్కా ప్లాన్‌తో ర్యాగింగ్‌? | - | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తో ర్యాగింగ్‌?

Aug 25 2025 9:21 AM | Updated on Aug 25 2025 9:21 AM

పక్కా ప్లాన్‌తో ర్యాగింగ్‌?

పక్కా ప్లాన్‌తో ర్యాగింగ్‌?

మెడికోపై సీనియర్ల అక్కసు

జీజీహెచ్‌ రూమ్‌ నంబర్‌ 302లో ర్యాగింగ్‌, దాడి

నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ను హౌస్‌ సర్జన్‌ ట్రెయినీలు(సీనియర్లు) పక్కా ప్లాన్‌ ప్రకారం ర్యాగింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా తనపై కక్షగట్టారని, అదునుకోసం ఎదురు చూసి ర్యాగింగ్‌ చేస్తూ దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రికి సమయానికి చేరుకొని డ్యూటీ చేసినా రిజిస్టర్‌లో అబ్సెంట్‌ వేశారని, దీనిపై ప్రశ్నించడంతో ఇదే అదునుగా తనను రూమ్‌ నంబర్‌ 302లోకి తీసుకెళ్లి రౌండప్‌ చేశారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులు పూర్తి వివరాలు పేర్కొన్నాడు.

లేబర్‌ వార్డు వద్ద మొదలై..

రాహుల్‌ను ముందుగా లేబర్‌ వార్డు వద్ద బెదిరించిన సీనియర్లు ఆ తరువాత రూమ్‌నంబర్‌ 302కి పిలిపించారు. అక్కడికి వెళ్లిన రాహుల్‌ను 15 నుంచి 20మంది బూతులు తిడుతూ రాహుల్‌ను రౌండప్‌ చేశారు. మమ్మల్ని ఎదిరిస్తావా? ఎయిర్‌ చెయిర్‌ వేయి.. బయోడేటా చెప్పు అంటూ గంటలపాటు ర్యాగింగ్‌ చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని రిపోర్టులు చూయించినా పట్టించుకోలేదు. ఒకే సారి ఐదుగురు దాడి చేశారు. రాహుల్‌ సెలఫోన్‌ లాక్కుని వాట్సాప్‌ చాటింగ్‌ చేశారు. ఇదంతా శనివారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు సాగింది.

విచారణకు కమిటీ

ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపట్టేందుకు నలుగురు సీనియర్‌ ప్రొఫెసర్లతో కమిటీ వేస్తామని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాములు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

వినాయక చవితి

గొడవ అంటూ బుకాయింపు

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మెడిసిన్‌ విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌, గొడవ ఘటనలు జరిగినప్పటికీ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, వైద్యులు మాత్రం మెడికోలు వినాయకచవితి పేరుతో రెండు గ్రూపులుగా విడిపోవడంతో గొడవ జరిగిందని బుకాయించారు. ఇంత జరిగినా విషయం బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై నాలుగేళ్లుగా కక్షగట్టారని, తాము డే స్కాలర్స్‌ కావడంతో అక్కసు పెంచుకున్నారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐదుగురు వైద్య విద్యార్థులపై కేసు

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ

ఖలీల్‌వాడి: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థి రాహుల్‌రెడ్డిపై దాడి చేసిన ఐదుగురి సీనియర్లపై కేసు నమో దు చేసినట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం తెలి పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డే స్కాలర్‌కాగా కొనసాగుతున్న నగరంలోని వీక్లి మార్కెట్‌కు చెందిన రాహుల్‌ ను మొదటి సంవత్సరం నుంచి సీనియర్‌ అయిన సాయిరాం పవన్‌ బూతులు తిడుతూ ర్యాగింగ్‌ చేసేవాడు. ప్రస్తుతం ఫైనలియర్‌లో ఉన్న రాహుల్‌ ఆస్పత్రిలో డ్యూటీ చేయగా, రిజి స్టర్‌లో అతడికి సాయిరాం ఆబ్సెంట్‌ వేశాడు. దీనిపై ప్రశ్నించిన రాహుల్‌ను సీనియర్లు సా యిరాం పవన్‌, శ్రావణ్‌, సాత్విక్‌ హృదయపాల్‌, అభినవ్‌ పెద్ది, ఆదిత్య కొట్టడంతోపాటు కాలేజీలో ఎలా ఉంటావో.. ఎలా తిరుగుతా వో.. ఎలా పాస్‌ అవుతావో చూస్తామని భయబ్రాంతులకు గురి చేశారు. అంతకు ముందు ర్యాగింగ్‌ చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన రాహుల్‌ తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఒకటో టౌన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌కు పా ల్పడే వారిని ఉపేక్షించేది లేదని, బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లేదా డయల్‌ 100 లేదా పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ 87126 59700కు స మాచారం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement