
గ్రామసభల నిర్వహణలో కార్యదర్శులే కీలకం
సుభాష్నగర్: జిల్లాలోని పౌర సమాజ సంస్థల సమన్వయంతో గ్రామసభలను బలోపేతం చేయాలని, సభల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు పేర్కొన్నారు. స.హ చట్టం, గ్రామసభ నిర్వహణ, కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యం తదితర అంశాలపై నగరంలోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(టీఎన్జీవో)లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పంచాయతీ కార్యదర్శులకు రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం ముగింపు సమావేశానికి డీపీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018, మహిళా సాధికారత, బాలల సంరక్షణ చట్టాలు వంటి అంశాలపై శిక్షణనిచ్చామన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సవాళ్లపై చర్చించారు. రిసోర్స్ పర్సన్ గోపాలకృష్ణ, శ్రీనివాస్రావు, ఎంపీడీవో రాంనారాయణ, ఎంపీవో రామకృష్ణ, 30 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
డీపీవో శ్రీనివాస్రావు
పంచాయతీ కార్యదర్శులకు
ముగిసిన శిక్షణ

గ్రామసభల నిర్వహణలో కార్యదర్శులే కీలకం