
సావెల్ ‘సహకారం’లో అక్రమాలు!
బాల్కొండ: మెండోరా మండలం సావెల్ సహకార సంఘంలో అక్రమాలు జోరుగా సాగాయి. సంఘంలో రూ.80 లక్షలు గోల్మాల్ జరిగాయంటూ ఆగస్టులో సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీవో శ్రీనివాస్రావు, సత్యనారయణ రావును విచారణ అధికారిగా నియామించారు. 8 నెలలుగా విచారణ చేపట్టిన అధికారి రూ.97లక్షలను స్వాహా చేసినట్లు నిగ్గు తేల్చారు. సావెల్ సహకార సంఘం పరిధిలో సావెల్, మెండోరా, కోడిచర్ల, చాకీర్యాల్ గ్రామాలు ఉన్నాయి. గత పాలక వర్గం హయాంలో రూ.35లక్షల నష్టాలు ఉంటే ప్రస్తుత పాలకవర్గం హయాంలో మరో రూ.45 లక్షలు చేరి మొత్తం 80 లక్షలకు చేరినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అంత కంటే ఎక్కువనే దుర్వినియోగం చేసినట్లు లెక్క తేలింది.
ఎవరి వాటా ఎంత..!
సావెల్ సహకార సంఘంలో జరిగిన అవినీతిలో ఎవరి వాటా ఎంత ఉందో తేల్చుటకు అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. సీఈవోగా విధులు నిర్వర్తించిన సురేందర్ రెడ్డి రూ.35 లక్షలు స్వాహా చేసినట్లు, అవి చెల్లించుట కోసం ముందే బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎరువుల సేల్స్మెన్ రూ.10 లక్షలు గోల్మాల్ చేసినట్లు అప్పుడే తేలింది. మిగిలిన రూ.52 లక్షల్లో పాలకవర్గం వా కూడ ఉన్నట్లు విచారణ అధికారి భావిస్తున్నారు. దీంతో పాలకవర్గ సభ్యులను కూడ బాధ్యులను చేస్తూ రికవరీ కోసం నోటీసులు కూడ జారీ చేశారు. సంఘంలో పెద్ద మొత్తంలో స్వాహ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.97లక్షలు గోల్మాల్
అయినట్లు తేల్చిన విచారణ అధికారి
రికవరీ కోసం నోటీస్లు జారీ
నోటీసులు జారీ చేశాం..
సావెల్ సహకార సంఘంలో రూ.97లక్షలు స్వాహా చేసినట్లు విచారణ అధికారి తేల్చారు. అందుకు బాధ్యులైన వారందరికీ నోటీసులను జారీ చేశాం. రికవరీ చేసి కేసులు నమోదు చేస్తాం. ఎవరి వాట ఎంత అనే దానిపై విచారణ సాగుతుంది.
– శ్రీనివాస్ రావు, డీసీవో, నిజామబాద్