
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం
నిజామాబాద్ సిటీ: ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న చరిత్రాత్మిక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 17వ డివిజన్ అంబేడ్కర్నగర్లో దళితులతో కలిసి వారి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలన్నారు. నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నాయకులు రత్నాకర్, జావెద్ అక్రమ్, పంచరెడ్డి సుదర్శన్, స్థానిక నాయకలు పాల్గొన్నారు.
ముప్పై ఏళ్ల కల నెరవేరింది
నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం భాషా పండితుల 30 ఏళ్ల కల నెరవేర్చిందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నగ రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున పదోన్నతులు లభించినందుకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు అందింస్తోందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే విద్యా వ్యవస్థ ఎంతో మెరుగుపడిందన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు.
కురుమ సంఘ భవనం ప్రారంభం
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ను నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి షబ్బీర్ అలీ ప్రారంభించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అన్ని కులాలు, అన్ని మతాలవారికి సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ఎజెండా అన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం