లక్ష్మణచాంద: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్, లక్ష్మణచాంద మండలాల్లో శనివారం పర్యటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోన్ గ్రామ పంచాయతీలో సర్ ఫారాల స్వీకరణను పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని అర్హుల ఓటు పోకుండా చూడాలని సూచించారు. బూత్స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారంలు సేకరించాలన్నారు. అనంతరం లక్ష్మణచాంద మండలం పార్పెల్లి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేశారు. గ్రామంలో ఓటర్ల సంఖ్య, పంపిణీ చేసిన ఫారాలు, ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు సంతోష్, సరిత, ఎంపీవో నసీరుద్దీన్, సర్పంచులు అబ్బడి పుష్ప, వనజ, ఉప సర్పంచ్ విద్యాసాగర్రెడ్డి, ఎన్నికల అధికారులు ఉన్నారు.


