నిర్మల్ రూరల్: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని, దీనిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్, ఖమ్మం వారి సహకారంతో ఏడు కంప్యూటర్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ... విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఉన్నత స్థాయిని అధిరోహించవచ్చన్నారు. దానికోసం శ్రద్ధ, క్రమశిక్షణ, కృషి అవసరమని పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెలిపారు. చదువుపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ డేనియల్, ఉపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


