నిర్మల్టౌన్: ప్రజల నుంచి అందే ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టపరంగా చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీజీపీ సీవీ.ఆనంద్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరును సమగ్రంగా సమీక్షించి సంబంధిత జిల్లా పోలీస్ అధికారులతో శాంతిభద్రత పరిస్థితి నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలపై చర్చించారు. సైబర్ నేరాల నివారణ, కోర్టు లియాజనింగ్, పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు, క్రైం మీటింగ్ల నిర్వహణ, నార్కోటిక్ డ్రైవ్లు, ఆరైవ్ అలైవ్ కార్యక్రమం, రోడ్డు భద్రత చర్యలు, జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, ఏవో యూనుస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


